మధుమేహం ప్రభావం ఏ శరీర భాగాలపై ఎక్కువ?
సాక్షి లైఫ్ : డయాబెటిస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన పెంచేందుకు ఏటా నవంబర్ 14వ తేదీని వరల్డ్ డయాబెటిస్ డే గా జరుపుకుంటారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల ద్వారా దీనిని ఎలా నివారించవచ్చు..? శరీరంలోని ఏ భాగాలను మధుమేహం ప్రభావితం చేస్తుందో వంటి విషయాలను చూద్దాం...
మధుమేహంలో..
మధుమేహంలో రెండు రకాలు ఉన్నాయి. అవి టైప్-1 , టైప్-2. టైప్-1 మధుమేహం జన్యుపరమైనది అయితే, టైప్-2 మధుమేహం ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఫలితంగా వస్తుంది. డయాబెటిస్ క్రమంగా శరీరంలోని ప్రతి భాగాన్ని బలహీనపరుస్తుంది. మధుమేహ రోగులు సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ప్రాణాంతకం కావచ్చు.
గుండె..
రక్తంలో చక్కెర స్థాయుల్లో నిత్యం హెచ్చుతగ్గులు జరుగుతూండటం గుండెకు ఏమాత్రం మంచిది కాదు. ట్రైగ్లిజరైడ్ల వంటి చెడు కొవ్వులు పెరిగిపోతే రక్తనాళాల మంట/వాపు (ఇన్ఫ్లమేషన్) చోటు చేసుకుంటుంది. దీని కారణంగా రక్త ప్రసరణ దెబ్బతింటుంది మరియు గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
కాలేయం..
డయాబెటిస్కు ప్రధాన కారణాలు జీవనశైలి, ఆహారం, శారీరక శ్రమ చేయకపోవడం. ముఖ్యంగా శరీరం కదలకపోతే కండరాలలో ఉన్న షుగర్ కాలేయానికి కూడా చేరుతుంది. దీని వల్ల కాలేయంలో వ్యాధి కారక సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. దీని కారణంగా, కాలేయం క్రమంగా దెబ్బ తింటుంది. అంతేకాదు దీనివల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
కళ్ళు..
టైప్-1 లేదా టైప్-2 అయినా, మధుమేహం సోకినప్పుడు ఎప్పటికప్పుడు చెకప్లు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే, అది రెటీనాలోని పలుచని రక్తనాళాల్లో వాపునకు కారణమవుతుంది. దాని వల్ల ద్రవం బయటకు వచ్చి రెటీనాపైకి వస్తుంది. బలహీనమైన నాళాలు కూడా రక్తం బయటకు రావడానికి కారణమవుతాయి. ఇది రెటీనాపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల కంటి సంబంధిత సమస్యలు తలెత్తడమే కాకుండా ఒక్కోసారి పూర్తిగా కంటి చూపు పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
మూత్రపిండాలు..
షుగర్ లెవల్స్ పెరగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ దెబ్బతింటుంది. దీని కారణంగా చాలా అవయవాల పనితీరు తగ్గుతుంది. అటువంటి వాటిలో మూత్రపిండాలు ఉన్నాయి. మూత్రం ద్వారా శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కిడ్నీ ప్రధాన పాత్రపోషిస్తుంది. షుగర్ లెవల్స్ పెరగడంవల్ల కిడ్నీలు వాటి పని సరిగ్గా చేయలేవు. దీంతో శరీరంలో టాక్సిన్స్ పెరిగి, ఆపై కిడ్నీ పనిచేయడం మానేస్తుంది.
పాదాలు..
మధుమేహం పాదాలపై కూడా ప్రభావం చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, పాదాలపై ఒక్కోసారి గాయాలు ఏర్పడతాయి. పాదాలు తిమ్మిరి, జలదరింపు, గాయాలు మానకపోవడం మధుమేహం లక్షణాలు. దీన్నే డయాబెటిక్ ఫుట్ అని కూడా అంటారు. సకాలంలో పట్టించుకోకపోతే నడవడం కూడా చాలా కష్టమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. మధుమేహానికి కారణం ఇవే.. వీటిని నివారించడానికి ఏం చేయాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
