మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి ప్రధాన కారణాలు..?

షేర్ చేయండి:
మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి ప్రధాన కారణాలు..?

సాక్షి లైఫ్ : కంటి సంబంధిత వ్యాధులు పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా తలెత్తుతున్నాయని అనేక పరిశోధనలు నిరూపించాయి. దీనికి  ప్రధాన కారణం లేకపోలేదని అంటున్నారు వైద్య నిపుణులు.. అసలు ఐ ప్రాబ్లమ్స్ లేడీస్ లోనే ఎందుకు ఎక్కువగా వస్తున్నాయనడానికి కారణాలేంటో తెలుసుకుందాం..   

కొన్ని రకాల కంటి వ్యాధులు..

మహిళల్లో తలెత్తే కొన్ని రకాల కంటి వ్యాధులు, లోపాలతో పాటు ఇటీవల కాలంలో పెరుగుతున్న సమస్యలు పరీక్షించేందుకు పలు రీసెర్చ్ సంస్థలు ప్రత్యేకంగా అధ్యయనం చేశాయి. ఈ అధ్యయనంలో ఆశ్చర్య కరమైన అంశాలు వెల్లడయ్యాయి.

 పురుషులతో పోలిస్తే..

వయస్సు పెరిగే కొద్దీ పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కంటి సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం 85 ఏళ్లు పైబడిన పురుషుల కంటే రెండు రెట్లకు పైగా మహిళల్లోనే ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయిట. 

వృద్ధాప్యం సమీపించే మహిళల్లో ఈ సమస్యలు సహజంగానే తలెత్తుతున్నాయి. ఇందులో వయస్సుతో పాటు తలెత్తే కంటిలోని రెటీనా క్షీణత, క్యాటరాక్ట్, గ్లాకోమా, చూపు మసకబారడం, థైరాయిడ్‌ కారణంగా తలెత్తే కంటి వ్యాధులతోపాటు పలు రకాల దృష్టి  సంబంధిత సమస్యలు వస్తున్నాయట.

హార్మోన్‌ మార్పులు..

 ముఖ్యంగా గర్భధారణ సమయంలో చోటుచేసుకునే హార్మోన్‌ మార్పులు, మెనోపాజ్‌ తోపాటు ఇతర కారణాల వల్ల మహిళల్లో ఎక్కువగా కంటి సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కంటి స్వరూపం, జన్యు పరమైన సమస్యలు కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి మహిళలు నలభై ఏళ్ల  తర్వాత ఖచ్చితంగా కంటి పరీక్షలు చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. 

గర్భoదాల్చిన సమయంలో..

మహిళలు గర్భoదాల్చిన సమయంలో శరీరంలో ఎక్కువ నీరు ఉంటుంది. దీనికరణంగా కార్నియా మందంగా మారి కంటిలోని ముందరి ఉపరితలాన్ని మార్చుతుంది. దీనివల్ల కళ్లు కాంతినిచూసే తీరు మారి దృష్టిసంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అంతే కాదు ఆ సమయంలో కళ్లుకూడా  ఒత్తిడికి గురవుతుంటాయి.

కంటిలోని రక్తనాళాలు..

 గర్భిణులకు గెస్టెషనల్‌ డయాబెటీస్‌ తలెత్తినప్పుడు గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువయ్యి కొంతమందికి డయాబెటిక్ రెటినోపతి, కంటిలోని రక్తనాళాలు దెబ్బతినడం జరుగుతుంది. దీని వల్ల దృష్టి సమస్యలు ఏర్పడతాయి. 

గర్భం కారణంగా కళ్లు పొడిబారడటం, కాంతిని చూస్తే తట్టుకోలేకపోవడం కూడా జరుగుతుంది. గర్భనిరోధక మాత్రలలోని హార్మోన్లు వాస్కులర్ మార్పులకు కారణమవుతాయి, పరోక్షంగా కంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు.

శరీరం సహజంగా మెనోపాజ్‌కి మారే సమయంలో సాధారణంగా హర్మోన్లతో కూడిన ఈస్ట్రోజెన్లు క్షీణిస్తాయి. ఈస్ట్రోజెన్‌లు కార్నియాతో పాటు కంటికి స్పష్టంగా ఉండేలా చూసి వెలుపలి పొరకు రక్షణగా నిలిచి కాంతిని చక్కగా చూడగలిగేలా చేస్తాయి. ఈస్ట్రోజెన్లు క్షీణించినప్పుడు కళ్లలో తేమ తగ్గుతుంది. దీంతో కళ్లు పొడిబారి చూపు మసకబారుతుంది. 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో పురుషులతో పోలిస్తే మహిళల్లో కళ్లు పొడిబారడం అనే సమస్య రెట్టింపు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

వయస్సు పైబడుతున్న..

పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నందు వల్ల, వయస్సు పైబడుతున్న కొద్ది వారిలో కంటి వ్యాధులు పెరిగే ముప్పు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే గణాంకపరంగా చూస్తే పురుషుకల కంటే స్త్రీలు ఎక్కువగా  మెడిసిన్స్ తీసుకుంటారు. ఈ మందులలో చాలా వరకు కంటికి సంబంధించి తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించేవే ఉంటాయి.  

కాబట్టి మహిళలు కంటి సమస్యలు రాకుండా ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు కళ్లకు మేలుచేసే ఆహారం తీసుకోవడం ఉత్తమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.