The Ebola Threat : ఎబోలా కారణంగా నెల రోజుల్లో వందకు పైగా మరణాలు.. ఇది ఎందుకు ప్రాణాంతకం అంటే..? 

షేర్ చేయండి:
The Ebola Threat : ఎబోలా కారణంగా నెల రోజుల్లో వందకు పైగా మరణాలు.. ఇది ఎందుకు ప్రాణాంతకం అంటే..? 

సాక్షి లైఫ్ : ఆఫ్రికా దేశాల్లో కోరలు చాచిన ప్రాణాంతక 'ఎబోలా' వైరస్ ప్రస్తుతం పలు ప్రపంచ దేశాలనుకలవరపెడుతోంది. కాంగో, ఉగాండా దేశాల్లో తీవ్రరూపం దాల్చిన ఈ వ్యాప్తి.. క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో పాటు పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. విదేశీ ప్రయాణాల నేపథ్యంలో భారత్‌కు కూడా ముప్పు పొంచి ఉందనే ఆందోళనల నడుమ, విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు మనదేశంలో అధికారికంగా ఒక్క కేసు కూడా నిర్ధారణ కానప్పటికీ, జైపూర్, హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్ వంటి ప్రాంతాల్లో విదేశాల నుంచి వచ్చిన కొందరిలో అనుమానిత లక్షణాలు కనిపించడంతో వైద్య నిపుణులు నిఘా పెంచారు.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

ముఖ్యంగా కాంగోలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే 550కి పైగా కేసులు నమోదు కాగా, వందకు పైగా మరణాలు సంభవించడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది 

'బుండిబుగ్యో' స్ట్రెయిన్‌తో ముప్పు..

ప్రస్తుతం ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలాకు అత్యంత అరుదైన 'బుండిబుగ్యో' (Bundibugyo) అనే కొత్త స్ట్రెయిన్ కారణమని అధికారులు గుర్తించారు. గతంలో వచ్చిన ఎబోలా రకాలతో పోలిస్తే దీనిని అదుపు చేయడం అత్యంత సవాలుగా మారింది. ఎందుకంటే, గతంలో అందుబాటులోకి వచ్చిన ఎబోలా వ్యాక్సిన్లు లేదా చికిత్సలు ఈ కొత్త స్ట్రెయిన్‌పై ప్రభావవంతంగా పనిచేయడం లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ రకానికి నిర్దిష్టమైన టీకా అందుబాటులో లేకపోవడమే ఆందోళనకు ప్రధాన కారణం.

ఎబోలా ఎందుకింత ప్రమాదకరం..?

శరీరంపై వేగంగా దాడి..ఎబోలా వైరస్ సంక్రమణ రేటు కరోనా వంటి శ్వాసకోశ వైరస్‌ల అంత వేగంగా లేకపోయినప్పటికీ, ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మాత్రం అత్యంత వేగంగా నష్టాన్ని కలిగిస్తుంది. వైరస్ సోకిన కొన్ని రోజుల్లోనే ఇది రక్తనాళాలు, అంతర్గత అవయ వాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలేయం, మూత్రపిండాలు (కిడ్నీలు), రక్త ప్రసరణ వ్యవస్థను దెబ్బతీసి, తీవ్ర రక్తస్రావానికి (Internal Bleeding) మరియు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది.

అధిక మరణాల రేటు..

ఎబోలా బారిన పడిన వారిలో మరణాల రేటు సుమారు 35 నుంచి 50 శాతం వరకు ఉంటోంది. అంటే సోకిన వారిలో సగానికి పైగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

సవాలుగా మారిన గుర్తింపు..

ఎబోలా సోకిన ప్రారంభంలో వచ్చే జ్వరం, తీవ్రమైన నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు సాధారణ ఫ్లూ లేదా వైరల్ జ్వరాలను పోలి ఉంటాయి. దీనివల్ల బాధితులు దీనిని సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. వ్యాధి ముదిరి, అంతర్గత అవయవాలు దెబ్బతినే దశలో ఆసుపత్రికి చేరుకోవడం వల్ల చికిత్స అందించడం కష్టతరంగా మారుతోంది. ప్రస్తుతం ఈ వైరస్‌కు ఖచ్చితమైన చికిత్స లేదా నిరూపితమైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారు ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా తక్షణమే అధికారులకు సమాచారం అందించి, వైద్య పరీక్షలు చేయించుకోవడం సురక్షితం.

 

 

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.