Dengue Alert : డెంగీ అలర్ట్..ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదమే..!
సాక్షి లైఫ్ : వానాకాలం రాగానే దోమల బెడద పెరిగి డెంగీ, మలేరియా (Dengue and Malaria) లాంటి వ్యాధులు విజృంభి స్తుంటాయి. సాధారణంగా డెంగీ లక్షణాలు మొదట్లో మామూలు వైరల్ ఫీవర్లాగే అనిపించినా, నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెడుతుంద ని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు డెంగీ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
వ్యాధి తీవ్రతకు సంకేతాలివే..
డెంగీ సోకినప్పుడు చాలా మందిలో అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. అయితే జ్వరంతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు..
కడుపులో భరించలేని నొప్పి రావడం.
ఆగకుండా పదే పదే వాంతులు కావడం.
ముక్కు, చిగుళ్లు లేదా మలం నుంచి రక్తం కారడం.
అలసట, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది.
ఈ లక్షణాలు కనిపిస్తే శరీరంలో ప్లేట్లెట్స్ (Platelets) కౌంట్ వేగంగా పడిపోతోందని, పరిస్థితి విషమిస్తోందని అర్థం చేసుకోవాలి.
అసలు డెంగీ లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఒకసారి డెంగీ బారిన పడిన వారు, భవిష్యత్తులో వేరొక డెంగీ వేరియంట్ (serotype) బారిన పడితే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. సాధారణంగా కనిపించే లక్షణాలు ఇవే..
తీవ్రమైన జ్వరం, తలనొప్పి.
కళ్ల వెనుక భాగంలో విపరీతమైన నొప్పి (retro-orbital pain).
కండరాలు, కీళ్ల నొప్పులు.
వికారం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావడం.
కొన్ని తీవ్రమైన కేసుల్లో రక్తనాళాల నుంచి ప్లాస్మా లీక్ అవ్వడం, రక్తపోటు (bp) ఒక్కసారిగా పడిపోవడం, అవయవాలు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి.
వైద్యుల సలహా ఏంటి..?
వాతావరణం మారుతోంది కదా అని జ్వరాన్ని తేలికగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. డెంగీ అనుమానం వస్తే కింది జాగ్రత్తలు తప్పనిసరి:
సొంత వైద్యం వద్దు..
జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని మెడికల్ షాపులకు వెళ్లి సొంతంగా మందులు వాడకూడదు. ముఖ్యంగా డిస్ప్రిన్ (Aspirin) లాంటి మందులు వాడితే అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది.
ద్రవ పదార్థాలు..
రోగి శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, ఓఆర్ఎస్ (ORS) ఎక్కువగా తాగుతుండాలి.
వెంటనే పరీక్షలు..
జ్వరం రెండు రోజులకు మించి తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి రక్తపరీక్షలు చేయించుకోవాలి.
దోమల నివారణ..
డెంగీ రోగిని కుట్టిన దోమ మరొకరిని కుడితే వారికీ వ్యాధి వ్యాపిస్తుంది. కాబట్టి రోగికి దోమతెరను ఉపయోగించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
