ఫాస్టింగ్ సమయంలో చేయాల్సినవి.. చేయకూడనివి..
సాక్షి లైఫ్ : ఉపవాసం.. అంటే..? ఆధ్యాత్మికానికి సంబంధించిందే కాదు.. ఆరోగ్యానికీ సంబంధించింది కూడా. నిర్ణీత సమయం వరకూ కడుపు ఖాళీగా ఉంచడమే ఉపవాసం. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. మన సమాజంలో ఉపవాస నియమాన్ని చాలా మంది పాటిస్తుంటారు. అటువంటి సమయంలో చేయాల్సినవి.. చేయకూడనివి తెలుసుకుందాం..?
ఫాస్టింగ్ సమయంలో నీరు తప్ప మరేదీ ముట్టకుండా ఉండేవాళ్ళు కొందరు.. అల్పాహారాన్ని తీసుకునే వారు మరికొందరు ఉంటారు. ఉపవాసం అన్నది 12 నుంచి 24 గంటల పాటు సాగే నియమం. ఇందులోనూ చాలా రకాలున్నాయి. పేగుల ఆరోగ్యం కోసం, శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపేందుకు వీలుగా ఆయుర్వేదం ఉపవాసాన్ని ఆచరించమనే చెబుతోంది.
ఒబెసిటీ, అధిక కొలెస్ట్రాల్..
‘‘ఫాస్టింగ్ అన్నది భౌతికంగానే కాదు మానసిక ఆరోగ్యానికీ సాయ పడుతుంది. ఒబెసిటీ, అధిక కొలెస్ట్రాల్, కాలేయ సమస్యలు ఇలా ఎన్నింటికో ఉపవాసం పరిష్కారం చూపిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఉపవాసం సమయంలో పండ్లు, నట్స్ కొబ్బరి నీరు, చెరకు రసం, పాలు, పెరుగు, మజ్జిగ, రాజ్ గిరా, సాబుదానా, చిలగడ దుంపలు, ఉడికించిన బంగాళాదుంపలను తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఉప్పు, తీపి పదార్థాలకు..
ఫాస్టింగ్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఫలితాలనిస్తుందని డాక్టర్లు అంటున్నారు. శరీర తత్వానికి సరిపడే ఫాస్టింగ్ ఆచరించడం కూడా మంచి ఫలితాలుంటాయి. ఉప్పు, తీపి పదార్థాలకు దూరంగా ఉండడం, కేవలం నీరు తీసుకునే ఉండడం, ద్రవ పదార్థాలు అంటే పండ్ల రసం, పాలు, ఆహారానికి, ఆహారానికి మధ్య సుదీర్ఘ విరామం ఇవ్వడం వంటి ఎన్నో రకాల ఫాస్టింగ్ లు ఉన్నాయి. అయితే ఫాస్టింగ్ ఉన్న వారు జంక్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు.
శరీర వ్యవస్థలో మార్పులు..
శరీర వ్యవస్థలో మార్పులు పునరావృతమయే 40 నుంచి 48 రోజుల కాలాన్ని మండలంగా భావిస్తారు. ఈ సమయంలో మూడు రోజుల పాటు ఆహారం అవసరం లేదు. మీ శరీరం ఎలా పనిచేస్తోందో అనే స్పృహ ఉంటే, మీకు ఫలానా రోజున భోజనం అక్కరలేదన్న సంగతి తెలుస్తుంది. మీరు ఆ రోజునా ఏ శ్రమ లేకుండానే, భోజనం చేయకుండా గడపాలి. చివరకి కుక్కలకీ, పిల్లులకీ కూడా ఈ అవగాహన ఉంటుంది. ఒకరోజు అవి అసలు ఆహారం ముట్టుకోవు.
ఏ రోజైతే జీర్ణవ్యవస్థ ఆహారం తీసుకోవడానికి నిరాకరిస్తుందో, ఆ రోజు శరీరం తనిని తాను శుద్ధి చేసుకోవడానికి వీలుకలుగుతుంది. చాలామందికి ఏ రోజు భోజనం చేయకుండా ఉండాలో తెలీదు గనుక, భారతీయ పంచాంగంలో, ఆ రోజును ఏకాదశిగా గుర్తించారు. ఏకాదశి చాంద్రమానంలో 11వ రోజు. అది ప్రతి 14రోజులకూ వస్తుంది. అది సంప్రదాయంగా ఉపవాసం చేసే రోజుగా భావిస్తారు.
పని ఒత్తిడి వల్ల..
కొంతమంది వారి పని ఒత్తిడి వల్ల, వాళ్ళకు తగిన ఆధ్యాత్మిక శిక్షణ లేకపోవడంతో ఆ రోజు ఉపవాసం చేయలేకపొతే, వాళ్ళు పండ్లను తిని గడిపేస్తారు. మనసునీ, శరీరాన్నీ ముందుగా ఉపవాసానికి తగిన విధంగా సిద్ధం చేయకుండా బలవంతంగా ఉపవాసం చేస్తే, లాభానికి బదులు ఆరోగ్యానికి ప్రమాదమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీ శరీరమూ, మనసూ, శక్తీ, ఆ సాధనకి తగినట్లుగా తయారుగా ఉంటే, మీకు ఉపవాసం వల్ల లాభం చేకూరుతుంది.
పోషక విలువలున్న పదార్థాలు..
తరచు పొగతాగేవారికీ, కాఫీ తాగేవారికీ, ఉపవాసం చేయడం చాలా కష్టంగా అనిపించవచ్చు. కనుక, ఉపవాసం ప్రారంభించక ముందు మీ శరీరాన్ని సరియైన పోషక విలువలున్న పదార్థాలు తినడం ద్వారా సిద్ధం చేసుకోవాలి.
పళ్ళూ, కూరగాయలు..
ముఖ్యంగా నీరు ఎక్కువగా ఉండే పళ్ళూ, కూరగాయలూ తినడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఉపవాసం చేయడం అనేది అందరికీ మంచిది కాకపోవచ్చు. దానివల్ల ఎన్నో లాభాలున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
