విజృంభిస్తున్న చాందీపురా వైరస్ ..16 మంది మృతి..
సాక్షి లైఫ్ : గుజరాత్లో చాందీపురా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 50 చాందీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని, 16 మంది ప్రాణాలు కోల్పోయారని గుజరాత్ ఆరోగ్య మంత్రి రిషికేష్ పటేల్ తెలిపారు.
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
హిమ్మత్పూర్లో 14 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు రోగులు చికిత్స పొందుతున్నారు. పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వైరస్ సోకిన చిన్నారి మరణించినట్లు ధృవీకరించారు. ఆ తర్వాత, ఇలాంటి లక్షణాలతో ఎక్కువ మంది మరణించినట్లు నివేదికలు వచ్చాయి. ప్రస్తుతం దాదాపు12 జిల్లాల్లో ఈ వ్యాధి సోకినట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది.
ల్యాబ్ పరీక్షల కోసం ఏడు కేసులకు సంబంధించిన శాంపిల్స్ ను పూణేకు పంపగా.. ఒకే ఒక్క కేసులో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ పరిస్థితిని సమీక్షించారు. ఈ అంటువ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మందికి వ్యాధి సోకే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే మరిన్ని జిల్లాల్లో వ్యాధి విస్తరిస్తున్నట్లు చెబుతున్నారు. వ్యాధి వ్యాప్తి అహ్మదాబాద్తో సహా నగరాల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని సివిల్ ఆస్పత్రిలో ఓ చిన్నారి అనారోగ్యంతో మృతి చెందింది. అన్ని గ్రామాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో దీనికి సంబంధించిన సమాచారం అందిస్తున్నారు. ముఖ్యమంత్రి కలెక్టర్లు, చీఫ్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ (CDHO) మెడికల్ కాలేజీలతో సమావేశమయ్యారని గుజరాత్ ఆరోగ్య మంత్రి తెలిపారు.
గుజరాత్ ఆరోగ్య మంత్రి ప్రకారం, చాందీపురా వైరస్ లక్షణాలు గుర్తించిన జిల్లాల్లో ఇప్పటివరకు 51,275 మందిని పరీక్షించారు. అన్ని జిల్లాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అనుమానిత నమూనాలను వెంటనే పూణే వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపాలని స్థానిక, జిల్లా ఆసుపత్రులకు సూచించినట్లు గుజరాత్ ఆరోగ్య మంత్రి తెలిపారు.
ఇది మొదటిసారిగా 1965లో మహారాష్ట్రలోని చాందీపూర్ జిల్లాలో నమోదైంది. జ్వరం, తలనొప్పి, వాంతులు అవ్వడం సాధారణ లక్షణాలుగా భావిస్తారు. తీవ్రమైన సందర్భాల్లో రోగి కోమాలోకి పోవచ్చు. ఇది ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది.
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
ఇది కూడా చదవండి.. బ్రకోలీని ఇలా తింటే10 రెట్లు ప్రయోజనాలు పొందవచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
