తెలంగాణరాష్ట్రంలో రెండు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు..
సాక్షి లైఫ్ : తెలంగాణరాష్ట్రంలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. పట్టణం, పల్లె అనే తేడాల్లేకుండా ఉదయం పది గంటల నుంచే ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ముఖ్యంగా నగరాల్లో మధ్యాహ్న సమయంలో భానుడి భగభగలతో జన సంచారం తగ్గి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వచ్చే రెండు రోజుల పాటు కూడా 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలే నమోదవుతాయని, వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.
ఇది కూడా చదవండి.. ఇన్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పురుషుల్లో ఎందుకు పెరుగుతున్నాయంటే..?
అత్యధిక ఉష్ణోగ్రతలు..
ఉమ్మడి నల్గొండ జిల్లాపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నమోదయ్యాయి. భానుడి ప్రతాపంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూర్యాపేట జిల్లా మునగాలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.7 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 46.6 ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లాలోని 29 ప్రాంతాల్లో 45.0 పైన ఉష్ణోగ్రతలు నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలో 17 ప్రాంతాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 ప్రాంతాల్లో 45.0 పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వడగాలులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ప్రాంతంలో భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక్కడి ప్రాంతంలో బొగ్గుగనులు, థర్మల్ కేంద్రాలు ఉండటంతో వడగాలులు మరింత ఉదృతంగా వీస్తున్నాయి. పరిసర గ్రామాల ప్రజలు రోడ్లపైకి రావాలంటే భయభ్రాంతులకుగురవుతున్నారు.
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
భారీ వర్షం..
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. సాయంత్రం దాదాపు గంటసేపు ఉరుములు మెరుపులు ఈదురగాలులతోకూడిన భారీ వర్షం కురిసింది. గత కొన్నిరోజులుగా భానుడి భగభగలకు గురవుతున్న జనాలకు నిన్న కురిసిన వర్షంతో ఉపశమనం లభించినట్లయింది.
ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
