Shigella Infection Alert in Kerala : కేరళలో 578 మందిలో షిగెల్లా.. పలు జిల్లాల్లో హై అలర్ట్..!
సాక్షి లైఫ్ : పొరుగు రాష్ట్రం కేరళను ఒకేసారి రెండు ప్రమాదకర ఇన్ఫెక్షన్లు వణికిస్తున్నాయి. అటు బ్యాక్టీరియా సంబంధిత 'షిగెల్లా', ఇటు ప్రాణాంతక 'నిపా' వైరస్ కేసులు వెలుగుచూస్తుండటంతో సరిహద్దు జిల్లాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వయనాడ్, తిరువనంతపురం, కొల్లాం, కోజికోడ్ జిల్లాల్లో ఈ ఇన్ఫెక్షన్ల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించినప్పటికీ, వైద్య యంత్రాంగం కఠిన నిఘా ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?
కోజికోడ్లో ‘నిపా’ కలవరం..
కోజికోడ్ జిల్లా పరిధిలోని రామనట్టుకరకు చెందిన ఒక వ్యక్తికి నిపా వైరస్ సోకినట్లు పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన 77 మందిని అధికారులు గుర్తించి, హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. వీరిలో 58 మంది ఆరోగ్య కార్యకర్తలు కాగా, మిగిలిన వారు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్నారు. ప్రస్తుతానికి వీరిలో ఎవరికీ వ్యాధి లక్షణాలు బయటపడలేదని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
పాఠశాల బావి నీటిలో ‘షిగెల్లా’ బ్యాక్టీరియా..
మరోవైపు కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపించే 'షిగెల్లా' బ్యాక్టీరియా కేసులు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. వయనాడ్లో 9 మందికి, తిరువనంతపురంలో ఆరుగురికి, కొల్లాంలో ఇద్దరికి, కోజికోడ్లో ముగ్గురికి ఈ ఇన్ఫెక్షన్ పాజిటివ్గా తేలింది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 578 మందిలో షిగెల్లా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 55 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముఖ్యంగా వయనాడ్లోని ఒకే పాఠశాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ వ్యాధి బారిన పడ్డారు. దీనిపై విచారణ చేపట్టగా, ఆ పాఠశాల బావి నీటిలో ప్రమాదకర స్థాయిలో షిగెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ముందస్తు జాగ్రత్తగా ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు జూన్ 14 వరకు సెలవులు ప్రకటించారు.
షిగెల్లా, నిపా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పర్యావరణ, ఆహార పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
లక్షణాలు.. జాగ్రత్తలు..
షిగెల్లా (Shigella).. ఇది కలుషిత నీరు, ఆహారం వల్ల వస్తుంది. తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు, జ్వరం దీని ప్రధాన లక్షణాలు. నీటిని బాగా కాచి, చల్లార్చి తాగడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా దీనిని నివారించవచ్చు.
నిపా (Nipah)..ఇది జంతువుల నుంచి ముఖ్యంగా గబ్బిలాలు నుంచి మనుషులకు వ్యాపించే ప్రాణాంతక వైరస్. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది దీని లక్షణాలు. పక్షులు, జంతువులు కొరికిన పండ్లను అస్సలు తినకూడదు.
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
