kids health care : వడగాలులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలర్ట్.. పిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులకు కీలక సూచనలు..
సాక్షి లైఫ్ : ఉత్తర భారతదేశంతో పాటు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఢిల్లీ-ఎన్సిఆర్ లాంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో వాతావరణ శాఖ నిరంతరం వడగాలుల హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ ఎండల తీవ్రత పెద్దల కంటే పిల్లలు, వృద్ధులపైనే ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బడికి వెళ్లే పిల్లలు, ఆరుబయట ఆడుకునే చిన్నారుల విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా వడదెబ్బ, కిడ్నీ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ముప్పు పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
పిల్లలకే ఎందుకు ఎక్కువ ముప్పు..?
పెద్దలతో పోలిస్తే పిల్లల శరీరాలు ఉష్ణోగ్రతలను అంత త్వరగా నియంత్రించుకోలేవు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) నిపుణుల ప్రకారం.. పిల్లల్లో జీవక్రియ (Metabolism) చాలా వేగంగా ఉంటుంది. దీనివల్ల వారి శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. దానికి తోడు ఆటల ధ్యాసలో పడి వారు తరచుగా నీళ్లు తాగడం మర్చిపోతారు. అధికంగా చెమట పట్టడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు పడిపోయి, వేగంగా డీహైడ్రేషన్కు గురవుతారు. ఎండలో చెప్పులు లేకుండా ఆడుకున్నా, స్కూల్ అసెంబ్లీలో ఎక్కువసేపు నిల్చున్నా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.
పిల్లల్లో వడదెబ్బ, వడగాలుల ప్రభావాన్ని సూచించే ప్రధాన లక్షణాలు ఇవే..
విపరీతమైన చెమట, తీవ్రమైన నీరసం.
తలనొప్పి, పదే పదే చిరాకు పడటం.
కండరాల నొప్పులు లేదా స్పృహ కోల్పోవడం.
గందరగోళంగా ఉండటం, నిస్సత్తువ ఆవహించడం.
వేగంగా శ్వాస తీసుకోవడం, గుండె స్పందనలు అమాంతం పెరగడం.
వికారం, వాంతులు.
వడదెబ్బ తగిలితే ఏం చేయాలి..?
శరీర ఉష్ణోగ్రత 104°F లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం తనను తాను చల్లబరుచుకోలేకపోవడాన్ని 'వడదెబ్బ' (Heatstroke) అంటారు. ఇది ప్రాణాంతకమైన వైద్య అత్యవసర పరిస్థితి.
వెంటనే పిల్లాడిని నీడగా ఉన్న చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి.
గాలి తగిలేలా ఒంటిపై ఉన్న దుస్తులను వదులు చేయాలి.
శరీరాన్ని చల్లటి నీటి పట్టీలతో తుడవాలి.
ఒకవేళ పిల్లాడు అపస్మారక స్థితిలో ఉంటే.. శ్వాసనాళంలో ఏదీ ఇరుక్కుపోకుండా ఉండేందుకు పక్కకు తిరిగి పడుకోబెట్టాలి.
ముఖ్య గమనిక: స్పృహ లేనప్పుడు నోటి ద్వారా నీళ్లు, ఆహారం అస్సలు ఇవ్వకూడదు. సొంత వైద్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..?
పిల్లలు అడగకపోయినా వారికి క్రమం తప్పకుండా నీళ్లు తాగిస్తూ ఉండాలి. నీటితో పాటు ఓఆర్ఎస్ (ORS), కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి తరచుగా ఇస్తుండాలి. ముఖ్యంగా చల్లని పానీయాలు, అధిక చక్కెర ఉండే కూల్డ్రింక్స్కు దూరంగా ఉంచాలి. బయట దొరికే వేయించిన, మసాలాలు దట్టించిన, నిల్వ ఉంచిన జంక్ ఫుడ్కు పిల్లలను దూరంగా ఉంచాలి. బడికి వెళ్లే ప్రతి పిల్లల బ్యాగ్లో తప్పనిసరిగా వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోవాలి. ఎండ వేళల్లో ఆరుబయట ఆడకుండా జాగ్రత్తపడాలి.
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
