Empty Stomach : పరగడుపున అరటిపండు తింటున్నారా..? అయితే ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..!
సాక్షి లైఫ్ : ఉదయం పూట ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సమయాభావం వల్ల చాలామంది హడావుడిగా ఒకటి, రెండు అరటిపండ్లు తినేసి పనులకు వెళ్తుంటారు. అయితే, ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? దీనివల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనివారు పరిమితంగా పరగడుపున అరటిపండు తినడం సురక్షితమే. అయితే, కేవలం అరటిపండు మాత్రమే తింటే అందులో ప్రోటీన్లు, కొవ్వుల శాతం తక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేస్తుంది. అందుకే దీనిని ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
తక్షణ శక్తికి కేరాఫ్ అడ్రస్..
అరటిపండులో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఉదయం వ్యాయామం చేసేవారికి లేదా ఆఫీసుకు త్వరగా వెళ్లేవారికి ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే, దీనిని నేరుగా తినే బదులు కొన్ని డ్రై ఫ్రూట్స్ లేదా ప్రోటీన్ ఫుడ్తో కలిపి తీసుకోవడం సమతుల్యమైన ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.
గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు..
కొంతమందికి పరగడుపున పండ్లు తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా ఎసిడిటీ సమస్యలు వస్తుంటాయి. మీరు కూడా పండ్లు తిన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటే, ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారంతో పాటు లేదా తిన్న తర్వాత అరటిపండు తినడం మంచిది. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.
మధుమేహ బాధితులు ఏం చేయాలి..?
అరటిపండులో సహజ చక్కెరల స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహం (diabetes) ఉన్నవారు కాస్త జాగ్రత్త వహించాలి. బాగా పండిన, పెద్ద అరటిపండుకు బదులుగా.. చిన్న సైజులో ఉన్న పండును ఎంచుకోవాలి. దీనిని ప్రోటీన్ లేదా ఫైబర్ అధికంగా ఉండే ఆహారంతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఏవైనా డైట్ మార్పులు చేసేముందు వైద్యులు లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం తప్పనిసరి.
తినడానికి సరైన విధానం..
అరటిపండును నేరుగా తినడం కంటే.. ఒక సమతుల్య అల్పాహారంలో భాగంగా చేసుకోవడమే అత్యుత్తమ మార్గం అని నిపుణులు చెబుతున్నారు. వోట్స్, పెరుగు, పీనట్ బటర్, డ్రై ఫ్రూట్స్ లేదా స్మూతీస్తో కలిపి దీన్ని తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లతో పాటు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అందుతాయి. ఫలితంగా ఎక్కువ సమయం కడుపు నిండిన భావన ఉంటుంది, రోజంతా ఉల్లాసంగా ఉంటారు.
పాటించాల్సిన జాగ్రత్తలు..
బాగా పండిన అరటిపండును మితంగా మాత్రమే తీసుకోవాలి. అల్పాహారం కోసం కేవలం అరటిపండుపైనే ఆధారపడకుండా, ప్రోటీన్, ఫైబర్ ఉండే ఇతర ఆహారాలను డైట్లో చేర్చుకోండి.
జీర్ణ సమస్యలు ఉంటే.. కడుపులో అసౌకర్యంగా అనిపిస్తే పరగడుపున తినడం మానుకుని, వెంటనే వైద్యులను సంప్రదించండి. షుగర్ వ్యాధిగ్రస్తులు పండు పరిమాణం, తినే సమయం విషయంలో వైద్యుల సలహా మేరకు నడుచుకోవడం సురక్షితం.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
