బీమాపై జీఎస్టీ: కస్టమర్లకు లాభమా, నష్టమా..?
సాక్షి లైఫ్ : ప్రస్తుతం బీమా పాలసీలపై విధించే 18శాతం జీఎస్టీని ప్రభుత్వం తొలగించింది. దీంతో బీమా పాలసీల ధరలు తగ్గుతాయని అంతా అనుకున్నారు. కానీ, కొన్ని బీమా కంపెనీలు ప్రీమియం ధరలు పెంచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే, అసలు ఈ కొత్త నిర్ణయంతో బీమా చౌకగా మారుతుందా లేదా మరింత ఖరీదవుతుందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
పాత విధానం ఎలా ఉండేది..?
గతంలో, మీరు ఒక బీమా పాలసీకి రూ. 100 ప్రీమియం చెల్లించాలను కుంటే, దానిపై 18శాతం జీఎస్టీ అదనంగా కట్టాల్సి వచ్చేది. అంటే, మీరు మొత్తం రూ. 118 చెల్లించేవారు. ఈ రూ. 18ను బీమా కంపెనీ ప్రభుత్వానికి చెల్లించేది. అయితే, బీమా కంపెనీలు తమ కార్యకలాపాల కోసం (ఉదాహరణకు, ఆఫీసు అద్దె, సాఫ్ట్వేర్, ఇతర సేవలు) చెల్లించిన జీఎస్టీని, ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రూపంలో తిరిగి పొందేవి. ఉదాహరణకు, కంపెనీ రూ. 5 జీఎస్టీ చెల్లించి ఉంటే, ఆ మొత్తం వారికి తిరిగి వచ్చేది. అంటే, కస్టమర్ రూ. 118 చెల్లించినప్పటికీ, కంపెనీకి కొంత జీఎస్టీ భారం తగ్గేది.
ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది..?
కొత్త నిబంధనల ప్రకారం, బీమా ప్రీమియంపై ఇక జీఎస్టీ ఉండదు. అంటే, మీరు రూ. 100 ప్రీమియం కోసం కేవలం రూ. 100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్కు ఇది నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే, ఇప్పుడు బీమా కంపెనీలు తమ వ్యాపార ఖర్చులపై చెల్లించిన జీఎస్టీకి ఐటీసీ లభించదు. అంటే, గతంలో వారికి తిరిగి వచ్చిన రూ. 5 ఇప్పుడు వారి భుజాలపై భారం పడుతుంది.
పాలసీ ప్రీమియం రూ. 20,000 అనుకుందాం.. గతంలో: రూ. 20,000 ప్రీమియం + 18% జీఎస్టీ (రూ. 3,600) = రూ. 23,600 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు: కేవలం రూ. 20,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే, జీఎస్టీ తొలగించడం వల్ల కస్టమర్కు వెంటనే రూ. 3,600 ఆదా అవుతుంది.
ఒకవేళ బీమా కంపెనీలు ఐటీసీ కోల్పోవడం వల్ల తమ ప్రీమియం ధరలను పెంచినా, మీకు లాభమే. ఉదాహరణకు, కంపెనీలు రూ. 20,000 పాలసీ ధరను రూ. 1,000 పెంచి, రూ. 21,000 చేసినా.. మీకు గతంలో జీఎస్టీ కింద చెల్లించిన రూ. 3,600 తో పోలిస్తే ఇప్పుడు చెల్లించే అదనపు మొత్తం (రూ. 1,000) చాలా తక్కువ. ఈ లెక్కన మీకు రూ. 2,600 ఆదా అవుతుంది.
లాభం ఎవరికి, నష్టం ఎవరికి అంటే..?
కస్టమర్లకు లాభం: జీఎస్టీ సున్నా కావడంతో, వినియోగదారులకు నేరుగా ఆర్థిక భారం తగ్గుతుంది. బీమా కంపెనీలకు నష్టం: వారికి ఐటీసీ ప్రయోజనం లభించదు. ఆ భారాన్ని వారే భరించాల్సి ఉంటుంది లేదా కొంతమేర ప్రీమియం ధరలు పెంచవచ్చు. ప్రభుత్వానికి: జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుంది. కానీ, ఎక్కువమంది బీమా తీసుకోవడానికి ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది, ఇది దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుంది. మొత్తానికి, బీమాపై జీఎస్టీని తొలగించడంతో వినియోగదారులకు మేలే జరుగుతుందని స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
