Top 7 Deadly Diseases in India: భారతీయుల ప్రాణాలు తీసున్న టాప్-7 డిసీజెస్.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : భారతదేశంలో మరణాల రేటును గమనిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం వృద్ధాప్యం వల్ల మాత్రమే కాకుండా, మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం, సరైన సమయంలో వైద్యం అందకపోవడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న ఆ 7 ప్రధాన అనారోగ్య సమస్యలపై ప్రత్యేక కథనం మీకోసం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

 

1. గుండెపోటు.. సైలెంట్ కిల్లర్.. (Cardiovascular Diseases).


భారతదేశంలో ప్రతి నలుగురు మరణించే వారిలో ఒకరు గుండె సంబంధిత వ్యాధుల వల్లే చనిపోతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, విపరీతమైన ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలు. గతంలో వృద్ధులకు మాత్రమే పరిమితమైన ఈ ముప్పు, ఇప్పుడు యువతను కూడా బలితీసుకుంటోంది. వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ పట్ల మక్కువ గుండెను బలహీనపరుస్తున్నాయి.

2. ప్రాణాలను కబళిస్తున్న శ్వాసకోశ వ్యాధులు(Respiratory Diseases)..


కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఊపిరితిత్తులు క్రమంగా క్షీణిస్తున్నాయి. గాలి కాలుష్యం, పొగతాగడం,పరిశ్రమల నుంచి వచ్చే ధూళి వల్ల 'సీఓపీడీ' (COPD) వంటి వ్యాధులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. చాలామంది దీనిని సాధారణ దగ్గుగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి విషమిస్తోంది.

3. మృత్యుఘంటికలు మోగిస్తున్న టీబీ (Tuberculosis)..

క్షయ వ్యాధికి సరైన చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ, భారత్‌లో దీని వల్ల మరణించే వారి సంఖ్య తగ్గకపోవడం ఆందోళనకరం. పోషకాహార లోపం, చికిత్సను మధ్యలోనే ఆపేయడం వల్ల ఈ వ్యాధి ముదిరి మరణానికి దారితీస్తోంది. సకాలంలో మందులు వాడితే దీని నుంచి సులభంగా బయటపడవచ్చు.

4. మధుమేహం.. అన్ని రోగాలకు మూలం (Diabetes)..

భారత్‌ను 'వరల్డ్ డయాబెటీస్ క్యాపిటల్ 'గా పిలుస్తున్నారు. షుగర్ వ్యాధి నేరుగా చంపకపోయినా.. కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, స్ట్రోక్ రావడం, కంటి చూపు కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోకపోతే ఇది ప్రాణాలను హరిస్తుంది. చాలామంది దీని బారీన పడి చనిపోతున్నారు. 

5. క్యాన్సర్ (Cancer).. 

నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు భారత్‌లో వేగంగా పెరుగుతున్నాయి. వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి వెళ్లడం వల్ల ప్రాణాలను కాపాడలేకపోతున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించడం సాధ్యమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

6. నీళ్ల విరేచనాలు.. శిశువులకు శాపం (Diarrhoeal Diseases)
అపరిశుభ్రమైన నీరు, పారిశుధ్య లోపం వల్ల వచ్చే విరేచనాలు ముఖ్యంగా చిన్నపిల్లల ప్రాణాలను హరిస్తున్నాయి. శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డి హైడ్రేషన్ అవ్వడం కారణంగా (Dehydration) గంటల వ్యవధిలోనే ప్రాణాలు పోతున్నాయి. ఓఆర్ఎస్ (ORS) స్వచ్ఛమైన నీటి వాడకంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది.

7. నవజాత శిశు మరణాలు (Neonatal Conditions)..

పుట్టిన నెల లోపే మరణించే శిశువుల సంఖ్య భారత్‌లో ఎక్కువగా ఉంది. నెలలు నిండకుండానే పుట్టడం, ఇన్ఫెక్షన్లు, ప్రసవ సమయంలో తలెత్తే సమస్యలు దీనికి కారణం. గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకోవడం, సురక్షిత ప్రసవాలు జరగడం వల్ల ఈ మరణాలను అరికట్టవచ్చు.

పరిష్కారం..?

ఈ వ్యాధుల నుంచి బయటపడాలంటే కేవలం మందులు మాత్రమే సరిపోవు. ఏటా కనీసం ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఉప్పు, పంచదార, నూనె వాడకం తగ్గించాలి. రోజుకు కనీసం 30 నిమిషాల నడక తప్పనిసరి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.