మ‌తిమ‌రుపునకు చికిత్స సాధ్య‌మేనా..?  

సాక్షి లైఫ్ : వయసుపైబడే కొద్దీ శరీరంలో సహజంగా కొన్నిరకాల మార్పులు జరుగుతాయి. త‌ర్వాత డిమెన్షియా (మ‌తిమ‌రుపు) అనేది స‌ర్వ‌సాధార‌ణంగా క‌నిపిస్తుంది. పిల్ల‌ల‌కు అప్పుడే ఫోన్ చేసినా, చేయ‌లేద‌నుకుని మ‌ళ్లీ మ‌ళ్లీ చేయ‌డం, మ‌ధ్యాహ్నం ఏం తిన్నారో సాయంత్రానికి గుర్తు లేక‌పోవ‌డం, మ‌నుషుల‌ను కూడా గుర్తుప‌ట్ట‌క‌పోవ‌డం లాంటివి ఉంటాయి. వీటిని చాలామంది పిల్ల‌లు చాద‌స్తం అని భావిస్తూ, పెద్ద‌ల‌ను విసుక్కుంటారు. 

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి..?

చికిత్స చేయిస్తే..

కానీ, నిజానికి అది డిమెన్షియా అని గుర్తించ‌డం ముఖ్యం. అలా గుర్తించి, చికిత్స చేయిస్తే వారికి పూర్తిగా న‌యం అయ్యే అవ‌కాశం కూడా ఉంటుంది. కొన్ని ర‌కాల డిమెన్షియాల‌లో స‌రికొత్త స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వారికి మూత్రంపై నియంత్ర‌ణ ఉండ‌దు. సాధార‌ణం కంటే చాలా వేగంగా న‌డుస్తుంటారు. ఎదురుగా ఉన్న‌వారు త‌ప్ప ఎక్క‌డో ఉన్న‌వారి పేర్లు కూడా గుర్తుండ‌వు. ఇలాంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారి విష‌యంలో పిల్ల‌లు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాలి. 

అది వైద్య‌ప‌ర‌మైన స‌మ‌స్య అన్న విష‌యం తెలుసుకుని, స‌రైన వైద్యుల‌కు చూపించి న‌యం చేయించుకోవ‌చ్చు. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌స్యే ఉన్న 73 ఏళ్ల వృద్ధుడికి ఎల్బీన‌గ‌ర్‌లోని కామినేని ఆస్ప‌త్రి వైద్యులు చిన్న‌పాటి చికిత్స చేసి, మొత్తం న‌యం చేశారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ న్యూరో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ర‌మేష్ వివ‌రించారు. 

గుర్తు ఉండేది కాదు.. 

“విశాఖ‌ప‌ట్నానికి చెందిన 73 ఏళ్ల శంక‌ర్రావు గ‌త ఆరేడు నెల‌లుగా డిమెన్షియాతో ఇబ్బంది ప‌డుతున్నారు. ఆయ‌న‌కు మూత్ర‌విస‌ర్జ‌న‌పై నియంత్ర‌ణ లేదు. మామూలుగా న‌డిచేదాని కంటే చాలా నెమ్మదిగా న‌డుస్తున్నారు. దాంతోపాటు, మ‌ధ్యాహ్నం ఏం తిన్నారో సాయంత్రానికి గుర్తు ఉండేది కాదు. ఇలా ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు ఉండేవి. కుటుంబ స‌భ్యులు మొద‌ట్లో కాస్త ఇబ్బంది ప‌డేవారు. పిల్ల‌ల‌కు ఫోన్ చేసినా, చేయ‌లేద‌నుకుని మ‌ళ్లీ మ‌ళ్లీ చేసేవారు. దీంతో పలు ఆస్ప‌త్రుల‌లో చూపించి, చివ‌ర‌కు ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చారు. 

మెద‌డులో నీరు..

ఇక్క‌డ ఆయ‌న‌ను ప‌రీక్షిస్తే మెద‌డులో నీరు చేరిన‌ట్లు తేలింది. సాధార‌ణంగా చిన్న‌వ‌యసులో వారికి ఇలా నీరు చేరితే ఆ భారాన్ని మోయ‌లేక కోమాలోకి వెళ్లిపోతారు. కానీ పెద్ద వ‌య‌సు వ‌చ్చే కొద్దీ మెద‌డు క్ర‌మంగా కుచించుకుపోతుంది. దానివ‌ల్ల అక్క‌డ కొంత స్థ‌లం ఏర్ప‌డి, అందులోకి ఈ నీరు చేరుతుంది. ఇలా నీరు చేర‌డం వ‌ల్ల అది మెద‌డుపై ఒత్తిడి క‌లిగించి, అందువ‌ల్ల డిమెన్షియా వ‌స్తుంది. 

ఈ త‌ర‌హా డిమెన్షియా.. 

ఈ త‌ర‌హా డిమెన్షియాను మాత్రం చిన్న‌పాటి శ‌స్త్రచికిత్స ప‌ద్ధ‌తుల‌తో న‌యం చేయ‌వ‌చ్చు. ఈ కేసులో శంక‌ర్రావుకు వ‌రుస‌గా మూడు రోజుల పాటు వెన్నెముక నుంచి నీరు తొల‌గించారు వైద్యులు. దానివ‌ల్ల మెద‌డులో ఉన్న నీరు క్ర‌మంగా త‌గ్గింది. ఆ త‌ర్వాత మెద‌డులో ఒక స్టెంట్ వేశారు. దాన్నుంచి మెద‌డులో ఉండే నీరు క్ర‌మంగా పొట్ట‌లోకి వ‌చ్చి, విస‌ర్జ‌న మార్గాల ద్వారా బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. ఇలా నీరు తీసిన మ‌రు నిమిషం నుంచే శంక‌ర్రావు ప‌రిస్థితి పూర్తిగా మారింది. 

సాధార‌ణ జీవితాన్ని

ఆయ‌న మ‌ళ్లీ త‌న సాధార‌ణ జీవితాన్ని గ‌డుపగలుగుతున్నారు. అంద‌రినీ గుర్తుప‌డుతున్నారు. ఎవరి సహాయం లేకుండానే న‌డుస్తున్నారు. ఇక రాబోయే ఐదేళ్ల వ‌ర‌కు కూడా ఆయ‌న‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వని,  ఎప్ప‌టిక‌ప్పుడు వైద్యుల‌కు చూపించుకుంటూ, అవ‌స‌ర‌మైన మందులు వాడితే స‌రిపోతుంది” అని డాక్ట‌ర్ ర‌మేష్ తెలిపారు. అయితే, అన్ని ర‌కాల డిమెన్షియాల‌కూ ఈ చికిత్స ప‌నికిరాద‌ని, కేవ‌లం మెద‌డులో నీరు చేర‌డం వ‌ల్ల క‌లిగే డిమెన్షియాను మాత్ర‌మే నయం చేయగ‌ల‌మ‌ని ఆయ‌న వివరించారు.

ఇది కూడా చదవండి.. శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : mental-health brain-health old-age brain-damage neurological-disorders dementia kamineni-hospital consultant-neurosurgeon

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com