మహిళల్లో అనీమియా సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలు..?

సాక్షి లైఫ్ న్యూస్: రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ప్రాణవాయువును ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ఇతర భాగాలకు తీసుకెళుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారికి ప్రాణవాయువు అన్ని భాగాలకు సక్రమంగా చేరదు.

దీని కారణంగా అలసట, నీరసం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సమస్య తీవ్రమైతే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదమని పలురకాల అధ్యయనాలు చెబుతున్నాయి.  

 రక్తహీనత సమస్య ఎక్కువకాలం కొనసాగితే రక్తంలో ప్రాణవాయువు తగ్గిపోయి గుండె, మెదడు, ఇతర అవయవాలకు నష్టం వాటిల్లుతుంది. ప్రపంచ దేశాల్లో రక్తహీనత బారిన పడుతున్నారు మహిళలు.

 ఒళ్లంతా నొప్పులు, అరికాళ్లలో మంటలు, కొద్దిదూరం నడిచినా ఆయాసం, చిన్న చిన్న పనులకే అలసట.. ఇవన్నీ రక్తహీనతకు సంకేతం కావచ్చు. రక్తంలో ఎర్రరక్తకణాలు తక్కువ కావడాన్నే రక్తహీనతగా భావిస్తారు. 

రక్తం తక్కువగా ఉండటం, ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గడం, ఎక్కువ మొత్తంలో ఎర్రరక్తకణాలు నాశనమవడం, ఇలా రక్తహీనత సమస్య మూడు రకాలుగా ఉంటుంది. వీటివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

 ఎనీమియా రావడానికి ముఖ్యకారణం..?

 ఎనీమియా రావడానికి ముఖ్యకారణం రక్తం లేకపోవడమే.. ఐరన్ లోపం వల్ల ఈ సమస్య రావొచ్చు. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణం వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గాల్లో అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. 

అలాగే శస్తచ్రికిత్సలు, గాయాలు, క్యాన్సర్ వంటి సమస్యల వల్ల కూడా ఈ సమస్య ఎదురుకావచ్చు. ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గిపోవడమనేది సహజంగా జరగొచ్చు. లేదా కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా తలెత్తొచ్చు. 

అలానే కొన్ని కారకాలు ఎర్రరక్తకణాలు ఏర్పడకుండా శరీరాన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఇలా జరగచ్చు. ఇక తీసుకునే ఆహారం, హార్మోనులు, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, గర్భం ధరించడం వంటివాటివల్ల కూడా ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ఎప్లాస్టిక్ ఎనీమియా వల్ల కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు.

 తీసుకునే ఆహారంలో ఇనుము, ఖనిజాలు, విటమిన్లు లేకపోవడం, పోషకాలను శరీరం స్వీకరించలేకపోవడం వల్ల కూడా రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. రక్తం తయారుకావడానికి ఎరిత్రోపయోనిక్ అనే హార్మోను అవసరమవుతుంది. 
 
ఇది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది. ఎర్రరక్తకణాలు నాశనమవడం, కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాల బారినపడినప్పుడు శరీరం ఎర్రరక్తకణాలను తయారు చేసుకోలేదు.
 
 రక్తహీనత ప్రధానంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 లోపం వల్ల ఎదురవుతుంది. ఆ పోషకాలను ఆహార రూపంలో అందుకోవాలంటే ఒకే తరహా ఆహారపదార్థాల నుంచి కాకుండా పోషకాలను కలిపి తీసుకోవాలి. 

ఐరన్ ఒక్కటే కాకుండా ఇతర విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పుదాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు.. వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి. 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags :

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com