Rainy Season : రెయినీ సీజన్లో.. జీర్ణశక్తి మెరుగుదల కోసం ఏం చేయాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలం రాగానే వాతావరణం చల్లబడి మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. కానీ, ఇదే సమయంలో పొట్ట సంబంధిత సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు ఈ కాలంలో సర్వసాధారణం. వాతావరణంలోని మార్పులు, బ్యాక్టీరియా వృద్ధి చెందడం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్తలే దీనికి ప్రధాన కారణాలు. పదే పదే జీర్ణ సమస్యలు వస్తుంటే మందులపై ఆధారపడటం కంటే, మన రోజువారీ అలవాట్లలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ఎంతో మేలు.

 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 

వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ ఎందుకు మందగిస్తుంది..?

ఈ కాలంలో వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా, ఫంగస్ చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. దీనికి తోడు మన శరీరంలో జీర్ణప్రక్రియ సహజంగానే కాస్త నెమ్మదిస్తుంది. కలుషిత నీరు, సరిగ్గా ఉడకని ఆహారం, బయటి జంక్ ఫుడ్ తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అందుకే ఈ సీజన్‌లో ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.

జీర్ణశక్తిని పెంచే మార్గాలు.. 

తాజా, తేలికపాటి ఆహారం..

ఎప్పటికప్పుడు వేడిగా వండుకున్న ఇంటి భోజనమే ఈ కాలంలో అత్యుత్తమం. నూనెలో వేయించినవి, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలు, నిల్వ ఉంచిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి జీర్ణవ్యవస్థపై అదనపు భారాన్ని మోపుతాయి.

తగినంత నీరు తాగాలి..

వాతావరణం చల్లగా ఉండటం వల్ల దాహం పెద్దగా అనిపించదు. కానీ, శరీరానికి అవసరమైన నీటిని కచ్చితంగా అందించాలి. వానాకాలంలో కాచి చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని తాగడమే సురక్షితం.

అల్లం, జీలకర్ర వాడకం..

పోపుల పెట్టెలో ఉండే అల్లం, జీలకర్ర, సోంపు వంటివి జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని కూరల్లో వేసుకోవడం లేదా గోరువెచ్చని హెర్బల్ వాటర్ రూపంలో తీసుకోవచ్చు.

ప్రోబయోటిక్ ఫుడ్స్..

పెరుగు, మజ్జిగ లాంటివి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

కూరగాయలు శుభ్రంగా కడగాలి..

 ఈ సీజన్‌లో కూరగాయలు, పండ్లపై దుమ్ము, బ్యాక్టీరియా చేరే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి వాటిని కోసే ముందు ప్రవహించే నీటిలో చాలా శుభ్రంగా కడగాలి.

సమయానికి భోజనం..

 ఎక్కువసేపు కడుపు మాడ్చుకోవడం లేదా రాత్రి పూట బాగా ఆలస్యంగా తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. కాబట్టి రోజూ ఒకే సమయానికి, మితంగా ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

చిన్నపాటి వ్యాయామం..

 రోజూ ఉదయం లేదా సాయంత్రం కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు నడక, చిన్నపాటి యోగా ఆసనాలు వేయడం వల్ల పొట్ట సమస్యలు దూరమై, తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

ఇది కూడా చదవండి.. Monsoon Food Alert : వర్షాకాలంలో ఈ 5 రకాల కూరగాయలతో జాగ్రత్త.. లేదంటే ముప్పే..!

 

చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.