Wet Cloth Therapy : శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు 'తడి గుడ్డ' చికిత్స ఎందుకు బెస్ట్..?
సాక్షి లైఫ్ : వేసవి కాలంలో భానుడి భగభగలకు తోడు, తీవ్రమైన వడగాలులు (Heat waves) జనాలను వణికిస్తున్నాయి. ఈ ఎండల తీవ్రత వల్ల శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోయి ‘డీహైడ్రేషన్’, ‘వడదెబ్బ’ (Sunstroke, Heatstroke) బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వడదెబ్బ తగిలినప్పుడు సకాలంలో స్పందించకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చు.
అయితే, వడదెబ్బ తగిలిన వెంటనే రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో మన అమ్మమ్మల కాలం నాటి ఒక సులభమైన గృహ చికిత్స ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు. ఆ గృహ వైద్యం ఏమిటి? వడదెబ్బ తగిలితే ఎలాంటి తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలో ఈనాటి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
శరీర ఉష్ణోగ్రతను తగ్గించే చికిత్స..
వడదెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే అకస్మాత్తుగా పెరిగిపోతుంది. దీనివల్ల తీవ్రమైన జ్వరం, తలతిరగడం, నీరసం, ఒళ్ళు మంటలు, స్పృహతప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి అత్యవసర స్థితిలో శరీర వేడిని తక్షణమే తగ్గించడానికి చల్లటి తడి గుడ్డతో శరీరాన్ని తుడవడం (Tepid sponging) అత్యంత ప్రభావవంతమైన మార్గం. చల్లని నీటిలో నానబెట్టిన గుడ్డను చర్మంపై ఉంచినప్పుడు, అది శరీరంలోని అదనపు వేడిని వేగంగా లాగేసుకుంటుంది. దీనివల్ల రక్తప్రసరణ సాధారణ స్థితికి వచ్చి, రోగికి ఆందోళన తగ్గి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ఈ చికిత్సను ఎలా చేయాలి..?
ముందుగా ఒక శుభ్రమైన, మృదువైన కాటన్ క్లాత్ ను లేదా చిన్న తువ్వాలును తీసుకోండి. ఆ గుడ్డను సాధారణ చల్లటి నీటిలో మరీ ఐస్ వాటర్ కాకుండా పూర్తిగా నానబెట్టి, కాస్త పిండాలి. తడి గుడ్డను రోగి నుదురు, మెడ, చంకలు, చేతులు, ఛాతీ, అరకాళ్లపై ఉంచుతూ సున్నితంగా అద్దాలి. ఈ భాగాలలో రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉండటం వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది. ప్రతి 5 నుంచి 10 నిమిషాలకు ఒకసారి గుడ్డను మళ్లీ నీటిలో తడుపుతూ ఈ ప్రక్రియను పునరావృతం చేయాలి.
చల్లని వాతావరణంలో రోగిని ఎండ తగలకుండా ఫ్యాన్ కింద లేదా చల్లని గాలి వీచే ప్రదేశంలో విశ్రాంతి తీసుకోనివ్వాలి. వడదెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన ఇతర తక్షణ జాగ్రత్తలు..
నీటి శాతాన్ని పెంచడం.. రోగి స్పృహలో ఉంటే.. శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటానికి ఓఆర్ఎస్ (ORS) ద్రావణం, నిమ్మరసం, మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లను కొద్దికొద్దిగా తాగించాలి.
ఐస్ వాటర్ వద్దు..
శరీరాన్ని చల్లబరిచే క్రమంలో మంచు ముక్కలను (Ice cubes) నేరుగా చర్మంపై రుద్దడం లేదా ఐస్ లాంటి చల్లటి నీటిని రోగిపై పోయడం చేయకూడదు. ఇది రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేస్తుంది. బట్టలు వదులు చేయడం..రోగి ధరించిన దుస్తులు గట్టిగా ఉంటే వాటిని వదులు చేయాలి. వీలైతే కాటన్ దుస్తులు మాత్రమే ఉంచాలి.
ఎప్పుడు ప్రమాదం..? వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?
వడదెబ్బ ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రథమ చికిత్స చేసినప్పటికీ ఒకవేళ జ్వరం తగ్గకపోతే, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుంటే, వాంతులు అవుతుంటే, రోగి స్పృహ కోల్పోతున్నట్లు గమనిస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందించాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యాహ్నం వేళల్లో అనవసరంగా బయటకు రాకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. తగినంత నీరు తాగి, గొడుగు లేదా టోపీ ధరించి వెళ్లడం ద్వారా వడదెబ్బ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. ఇన్స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
