COVID-19 : ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రెచ్చిపోతున్న కరోనా : ఇప్పటికే 12 కేసులు, నలుగురు మృతి..
సాక్షి లైఫ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ నెమ్మదిగా పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా కోవిడ్ కేసులు వెలుగుచూస్తుండటం ప్రజల్లో కాస్త ఆందోళన కలిగిస్తోంది. జూన్ 26 నుంచి జూలై 16 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 12 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ధృవీకరించింది. దురదృష్టవశాత్తూ ఈ మహమ్మారి బారిన పడి నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు.
వైరస్ తీవ్రతను, అది ఏ వేరియంట్కు చెందిందో తెలుసుకునేందుకు అధికారులు ఇప్పటికే 5 శాంపిళ్లను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
జిల్లాల వారీగా వివరాలు ఇలా..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ 12 కేసులు రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో నమోదయ్యాయి. ఎక్కడా ఒకే చోట పెద్ద సంఖ్యలో కేసులు సమూహాలుగా (Clustering) నమోదు కాకపోవడం కొంత ఉపశమనం కలిగించే అంశం.
కడప జిల్లా..అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి.
గుంటూరు జిల్లా..2 కేసులు వెలుగుచూశాయి.
విశాఖపట్నం: 1 కేసు నమోదైంది. (విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ వాణి తెలిపిన వివరాల ప్రకారం.. సదరు రోగికి లక్షణాలు ఉండటంతో ప్రైవేట్ ల్యాబ్లో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత కేజీహెచ్లో మళ్లీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి కోవిడ్గా ఖరారు చేశారు.)
కాకినాడ: 1 కేసు నమోదైంది. (ఈ బాధితుడికి తమిళనాడులోని సీఎంసీ వెల్లూరులో పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలింది.)
ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు హోం ఐసోలేషన్లో ఉండగా, ఇద్దరు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.
మృతులకు ఇతర ఆరోగ్య సమస్యలు..
మరణించిన నలుగురు రోగులు కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడకు చెందిన ఒకరు ఇప్పటికే తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వీరంతా హైపర్టెన్షన్, మధుమేహం, కిడ్నీ వ్యాధులు, ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కోవిడ్ బారిన పడ్డారని అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా పెరిగిన కేసులు..
జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 339 కేసులు నమోదు కాగా, అత్యధికంగా కేరళలో 115, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవుల్లో 18 చొప్పున, రాజస్థాన్లో 12 కేసులు వెలుగుచూశాయి.
ఆందోళన వద్దు..
రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజలెవరూ భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని హెల్త్ సెక్రటరీ వీరపాండియన్ భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు, ఆసుపత్రులు, ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశామని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే, ప్రజలు స్వయం నియంత్రణ పాటిస్తూ.. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి కనీస కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
ఇది కూడా చదవండి..Gen Z Trend ‘Panic Pouch’ : జెన్ జెడ్ ట్రెండ్ ‘పానిక్ పౌచ్’.. యాంగ్జైటీ, ఒత్తిడికి చెక్ పెట్టే మినీ కిట్..!
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
