Depression Gripping Youth : యువతను కబళిస్తున్న కుంగుబాటు.. ఆత్మహత్యలకు ప్రధాన కారణమవుతున్న మానసిక ఒత్తిడి..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దేశ భవిష్యత్తుకు వెన్నెముకగా నిలవాల్సిన యువత.. మనోవేదనతో అర్ధాంతరంగా తనువు చాలిస్తోంది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సున్న వారి మరణాలకు 'ఆత్మహత్యలే' ప్రధాన కారణమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) 2021-23 నివేదిక వెల్లడించింది. 2020 నుంచి ఇదే ధోరణి కొనసాగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

నివేదికలోని ప్రధాన అంశాలు..

2021-23 మధ్యకాలంలో 15-29 ఏళ్ల యువతలో నమోదైన మొత్తం మరణాలలో 17.3 శాతం ఆత్మహత్యల వల్ల సంభవించినవే. గత నివేదిక (2020-22) లో ఇది 17.1 శాతంగా ఉండగా, ఇప్పుడు మరింత పెరిగింది. యువత మరణాల్లో రెండో ప్రధాన కారణం వాహన ప్రమాదాలు 16.4శాతం. రహదారి ప్రమాదాల కంటే మానసిక ఒత్తిడి కారణంగానే ఎక్కువ మంది యువత ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా అన్ని వయసుల వారి మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బులే 31శాతం. ఆ తర్వాత శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 9.3శాతం, కణితులు 6.4శాతం, జీర్ణకోశ వ్యాధులు 5.3శాతం ఉన్నాయి.

ఆందోళనకరంగా మారుతున్న మానసిక ఆరోగ్యం.. 

ఒకప్పుడు ప్రమాదాలు లేదా అనారోగ్య కారణాల వల్ల యువత మరణించేవారు. కానీ గత మూడేళ్లుగా పరిస్థితి తలకిందులైంది. చదువుల్లో ఒత్తిడి, నిరుద్యోగం, వ్యక్తిగత సంబంధాల్లో సమస్యలు, మారుతున్న జీవనశైలి వంటివి యువతను కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. యువతలో పెరుగుతున్న ఈ ధోరణి సమాజానికి హెచ్చరిక వంటిది. మనస్తాపానికి గురైనప్పుడు మౌనంగా ఉండటం కంటే, ఆప్తులతో పంచుకోవడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు. 

యువత మానసిక దృఢత్వానికి మార్గాలు..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం. ముఖ్యంగా ఒత్తిడికి లోనవుతున్న యువత తమ మనసులోని బాధను లేదా ఆందోళనను కేవలం తమలోనే దాచుకోకుండా, నమ్మకమైన స్నేహితులతోనో లేదా కుటుంబ సభ్యులతోనో స్వేచ్ఛగా పంచుకోవాలి. ఇలా సంభాషించడం వల్ల మనసు తేలికపడటమే కాకుండా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిరాశ తీవ్రంగా ఉండి, దైనందిన జీవితంపై ప్రభావం చూపుతుంటే మొహమాట పడకుండా వెంటనే సైకాలజిస్ట్‌ వంటి నిపుణుల సాయం తీసుకోవాలి.

కేవలం మానసిక ప్రయత్నాలే కాకుండా, సరైన జీవనశైలి కూడా మనశ్శాంతిని ఇస్తుంది. ప్రతిరోజూ తగినంత నిద్ర పోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడు చురుగ్గా మారి మానసిక దృఢత్వం పెరుగుతుంది. వీటికి తోడు, ప్రస్తుతం యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియాకు అప్పుడప్పుడు విరామం ఇవ్వడం చాలా ముఖ్యం.

అక్కడ కనిపించే కృత్రిమ జీవితాలతో మన వాస్తవ జీవితాన్ని పోల్చుకోవడం మానేసి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సానుకూల దృక్పథంతో దృష్టి పెట్టినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. మీకు లేదా మీకు తెలిసిన వారికి ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే, దయచేసి వెంటనే ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయండి. ప్రాణం చాలా విలువైనది.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.