Smartphones : స్మార్ట్‌ఫోన్‌తో మెదడు, కళ్లకు ముప్పు ఉందా..? అపోహలు, వాస్తవాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం అలారం కట్టడం నుంచి రాత్రి పడుకునే ముందు సోషల్ మీడియా చూసేవరకు స్మార్ట్‌ఫోన్ మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే ఫోన్ వాడకం పెరిగేకొద్దీ, దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై కూడా అంతే స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఫోన్ రేడియేషన్ వల్ల మెదడుకు క్యాన్సర్ వస్తుందని, బ్లూ లైట్ వల్ల కళ్లు శాశ్వతంగా దెబ్బతింటాయని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. మరి ఈ వాదనల్లో ఎంతవరకు నిజం..? ఇవి అపోహలా..? వాస్తవాలా..? ఇప్పుడు శాస్త్రీయంగా తెలుసుకుందాం..

 

 

ఇది కూడా చదవండి..  ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

ముప్పు ఫోన్‌తో కాదు.. మన వాడకంతోనే..!

స్మార్ట్‌ఫోన్ వాడటం కంటే, దాన్ని మితిమీరి వాడటమే ఆరోగ్యానికి అసలైన ముప్పు అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గంటల తరబడి స్క్రీన్‌కే అతుక్కుపోవడం, రాత్రి పొద్దుపోయే వరకు ఫోన్ చూడటం, తప్పుడు భంగిమలో కూర్చోవడం వంటివి కచ్చితంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కానీ, ఇంటర్నెట్‌లో ప్రచారంలో ఉన్న కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యల వెనుక ఉన్న అసలు వాస్తవాలు వేరుగా ఉన్నాయి.

ప్రధాన అపోహలు-శాస్త్రీయ వాస్తవాలు..


అపోహ..స్మార్ట్‌ఫోన్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది.

వాస్తవం..ఇది నిరాధారమైన వాదన. స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేసేది 'నాన్-అయానైజింగ్ (Non-ionizing) రేడియో ఫ్రీక్వెన్సీ' తరంగాలను. వీటికి నేరుగా మన డీఎన్‌ఏ (DNA)ను దెబ్బతీసేంత శక్తి ఉండదు. సాధారణ మొబైల్ వాడకానికి, మెదడు కణితులు లేదా క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని 'ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్' స్పష్టం చేసింది.

అపోహ.. బ్లూ లైట్ వల్ల కళ్లు శాశ్వతంగా దెబ్బతింటాయి.

వాస్తవం.. ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి (Blue light) వల్ల కళ్లకు శాశ్వత నష్టం వాటిల్లుతుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని 'అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ' తేల్చిచెప్పింది. అయితే, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కళ్లు పొడిబారడం, అలసట, తలనొప్పి వంటి సమస్యలు కచ్చితంగా వస్తాయి.

అపోహ.. స్మార్ట్‌ఫోన్‌లు మెదడును బలహీనపరుస్తాయి..

వాస్తవం.. ఫోన్ రేడియేషన్ నేరుగా మెదడును దెబ్బతీస్తుందనడానికి లేదా జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తుందనడానికి వైద్యపరమైన ఆధారాలు లేవు. అయితే, రాత్రిళ్లు నిద్ర మానుకుని ఫోన్ చూడటం వల్ల నిద్ర సైకిల్ దెబ్బతింటుంది. సరైన నిద్ర లేకపోవడం వల్లే మరుసటి రోజు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపిస్తాయి. అంతేతప్ప, దీనికి ఫోన్ రేడియేషన్ కారణం కాదు. స్మార్ట్‌ఫోన్ మనల్ని అనారోగ్యాల పాలు చేయదు, కానీ మితిమీరిన 'స్క్రీన్ టైమ్' మాత్రం కచ్చితంగా కళ్లు, నిద్ర, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, నిద్రపోవడానికి కనీసం గంట ముందు మొబైల్‌ను పక్కనపెట్టడం అలవాటు చేసుకోండి.

ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.