Mantra Therapy for Heart Health : గుండె ఆరోగ్యానికి ‘మంత్ర’ చికిత్స: మహామృత్యుంజయ జపంతో రక్తపోటు నియంత్రణ..! సైన్స్ చెప్పిన నిజాలు
సాక్షి లైఫ్ : భారతీయ సనాతన సంప్రదాయంలో మంత్ర జపానికి విశిష్ట స్థానం ఉంది. మంత్రోచ్ఛారణ వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. అయితే, ఇప్పుడు ఇదే విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించారు పరిశోధకులు. నిత్యం కేవలం ఐదు నిమిషాల పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని లేదా శాంతి మంత్రాన్ని జపించడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రక్తపోటు (bp), గుండె స్పందన రేటు (heart rate) అదుపులోకి వస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక 'మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా' పరిశోధకులు నిర్వహించిన ఈ ఆసక్తికర అధ్యయన వివరాలు ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బయలాజికల్ అండ్ మెడికల్ రీసెర్చ్’లో ప్రచురితమయ్యాయి.
ఇది కూడా చదవండి..Knee Pain : నడిచినా నొప్పి.. కూర్చున్నా నొప్పి..? మోకాళ్లలో 'టక్ టక్' శబ్దం వస్తుందా..? ఇదిగో పరిష్కారం..
ఇది కూడా చదవండి..Irritable Bowel Syndrome : ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ (IBS) అంటే ఏమిటి..? లక్షణాలెలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
పరిశోధన సాగిందిలా..
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 30 మంది ఆరోగ్యవంతులైన యువ యోగా విద్యార్థులను ఎంపిక చేశారు. వారిని ఐదు నిమిషాల పాటు మహామృత్యుంజయ మంత్రం లేదా శాంతి మంత్రాన్ని బిగ్గరగా జపించమని కోరారు. ఆ తర్వాత మరో ఐదు నిమిషాల పాటు వారిని ఎటువంటి శబ్దం చేయకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోమన్నారు. ఈ ప్రక్రియకు ముందు, జపం చేస్తున్నప్పుడు, జపం పూర్తయిన తర్వాత వారి శరీరంలో చోటుచేసుకున్న మార్పులను నిశితంగా పరిశీలించారు.
అధ్యయనంలో తేలిన ఆశ్చర్యకరమైన నిజాలు..
మంత్రోచ్ఛారణ ముగించి, ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చున్న విద్యార్థుల శరీరంలో సానుకూల మార్పులు కనిపించాయి.
తగ్గిన హృదయ స్పందన, బీపీ..
పాల్గొన్న వారిలో హృదయ స్పందన రేటుతో పాటు రక్తపోటు గణనీయంగా తగ్గినట్లు నమోదైంది. వైద్య పరిభాషలో 'రేట్ ప్రెజర్ ప్రొడక్ట్', 'డబుల్ ప్రొడక్ట్' అని పిలిచే సూచికలు తగ్గాయి. అంటే గుండె సజావుగా పనిచేయడానికి మునుపటి కంటే తక్కువ ఆక్సిజన్, తక్కువ శ్రమ అవసరమైందని, తద్వారా గుండెపై ఒత్తిడి తగ్గిందని దీని అర్థం. శ్వాసక్రియలో స్థిరత్వం.. ముఖ్యంగా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించిన వారిలో శ్వాస తీసుకునే వేగం తగ్గి, శరీరం పూర్తి విశ్రాంతి స్థితికి చేరుకుంది.
సైన్స్ ఏం చెబుతోంది..?
మంత్ర జపం చేస్తున్నప్పుడు ఒత్తిడిని తగ్గించే శరీరంలోని 'పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ' (Parasympathetic Nervous System) ఉత్తేజితమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వ్యవస్థ యాక్టివేట్ అయినప్పుడు శరీరం రిలాక్స్ అవ్వడమే కాకుండా, రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది.
"కేవలం కొన్ని నిమిషాల మంత్ర జపం, ఆపై లభించే నిశ్శబ్దం గుండెపై పనిభారాన్ని తక్షణమే తగ్గిస్తాయి. భవిష్యత్తులో యోగా, వెల్నెస్ కార్యక్రమాల్లో దీనిని ఒక భాగం చేయవచ్చు" అని అధ్యయనంలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఇందు శర్మ, డాక్టర్ రామేశ్వర్ పాల్ పేర్కొన్నారు.
ఈ పరిశోధన కేవలం ఆరోగ్యంగా ఉన్న యువకులపై, తక్షణ ప్రభావాలను తెలుసుకోవడానికి మాత్రమే జరిగిందని పరిశోధకులు స్పష్టం చేశారు. కాబట్టి మంత్ర జపంతో గుండె జబ్బులు పూర్తిగా నయమవుతాయని భావించలేమని, బీపీ లేదా గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు, మందులను యథావిధిగా కొనసాగిస్తూనే.. మానసిక ప్రశాంతత కోసం ఈ పద్ధతిని అనుసరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
