Registrar General of Census Report (2020-24) : భారత్ లో పెరిగిన ఆయుర్దాయం : పురుషుల్లో జమ్మూకాశ్మీర్.. మహిళల్లో కేరళ టాప్..!
సాక్షి లైఫ్ : దేశంలో అందుబాటులోకి వస్తున్న మెరుగైన ఉచిత వైద్యం, విస్తృత వ్యాక్సినేషన్ , నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ప్రభావం భారతీయుల ఆయుష్షుపై స్పష్టంగా కనిపిస్తోంది. గతంతో పోలిస్తే దేశంలో సగటు ఆయుర్దాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సెన్సస్ విడుదల చేసిన తాజా (2020-24) నివేదిక ప్రకారం, భారతదేశంలో సగటు ఆయుర్దాయం 70.6 సంవత్సరాలకు చేరుకుంది. గత నివేదిక (2019-23) తో పోలిస్తే ఇది 0.3 సంవత్సరాలు పెరగడం విశేషం.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఈ నివేదికలోని ముఖ్యాంశాల ప్రకారం.. దేశంలో పురుషుల కంటే మహిళల సగటు ఆయుర్దాయమే 4.1 సంవత్సరాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రాల వారీగా చూస్తే జమ్మూ కాశ్మీర్లో పురుషులు, కేరళలో మహిళలు అత్యధిక కాలం జీవిస్తున్నారు.
రాష్ట్రాల వారీగా ఆయుష్షు వివరాలు..
కేరళ ప్రథమ స్థానం..
దేశంలోనే అత్యధికంగా 75.6 సంవత్సరాల సగటు ఆయుర్దాయంతో కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి మెరుగైన జీవన ప్రమాణాలు, వైద్య సదుపాయాలే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. మహిళల ఆయుర్దాయంలోనూ కేరళే ముందంజలో ఉంది.
జమ్మూ కాశ్మీర్ (పురుషులు)..
పురుషుల జనన ఆయుర్దాయం విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్ 73.8 సంవత్సరాలతో దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్లో భిన్నం..
స్త్రీ, పురుషుల ఆయుర్దాయం మధ్య అత్యధిక వ్యత్యాసం హిమాచల్ ప్రదేశ్లో నమోదైంది. ఇక్కడ పురుషుల కంటే మహిళల ఆయుష్షు 7.1 సంవత్సరాలు ఎక్కువగా ఉండటం గమనార్హం.
వెనుకబడిన ఛత్తీస్గఢ్..
పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ అత్యల్ప ఆయుర్దాయం కలిగిన రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ నిలిచింది. ఇక్కడి సగటు ఆయుష్షు కేవలం 64.7 సంవత్సరాలు మాత్రమే. అలాగే మహిళల ఆయుర్దాయం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.
నగరాలు వర్సెస్ పల్లెలు..
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే సగటు ఆయుర్దాయం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. పట్టణాల్లో పుట్టిన వారికి, అలాగే 70 ఏళ్ల వయసు పైబడిన వారికి ఆయుష్షు ఎక్కువగా ఉంటోంది. అయితే కొన్ని రాష్ట్రాలు దీనికి మినహాయింపుగా నిలిచాయి.
పల్లెల్లోనే ఎక్కువ ఆయుష్షు..
కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే జనన సమయం నాటి ఆయుర్దాయం ఎక్కువగా నమోదైంది.
70 ఏళ్ల తర్వాత పల్లెటూరి ప్రాణం..
ఇక 70 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఛత్తీస్గఢ్తో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, హర్యానా గ్రామీణ ప్రాంతాల ప్రజలు నగరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
ప్రభుత్వాల ముందున్న సవాళ్లు..
దేశంలో సగటు ఆయుర్దాయం పెరగడం శుభపరిణామమే అయినప్పటికీ, దీనివల్ల భవిష్యత్తులో వృద్ధుల జనాభా వేగంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తదనుగుణంగా వృద్ధుల సంరక్షణ, ఆరోగ్య రక్షణ, సామాజిక భద్రత పెన్షన్లు, ఇతర వసతులుపై ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే వెనుకబడిన రాష్ట్రాల్లోనూ వైద్య సేవలను బలోపేతం చేసి, దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను సమానంగా అందించడం రాబోయే రోజుల్లో పాలకులకు ఒక సవాలుగా మారనుంది.
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
