WHO సంచలన హెచ్చరిక..! నడుము నొప్పి కేవలం వృద్ధాప్య సమస్య కాదు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నడుము నొప్పి అనగానే "వయసు అయిపోయిందిలే" అని తేలికగా కొట్టిపారేయడం చాలామందికి అలవాటు. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదిక ప్రకారం, ఈ సమస్య కేవలం వృద్ధులకే పరిమితం కాదు, నేటి యువతరాన్ని కూడా ఇది తీవ్రంగా వేధిస్తోంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ రోజువారీ పనులు చేసుకోలేక వైకల్యం (Disability) బారిన పడటానికి నడుము నొప్పే ప్రధాన కారణంగా మారుతోందని WHO స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

బాధితుల్లో ఎక్కువమంది..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 61.9 కోట్ల మంది నడుము నొప్పితో నరకం అనుభవిస్తున్నారు. ఈ బాధితుల్లో ఎక్కువమంది 50 నుంచి 55 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. అంటే, మనుషులు శారీరకంగా, వృత్తిపరంగా అత్యంత చురుగ్గా పనిచేసే వయసులోనే ఈ సమస్య ఎక్కువగా పంజా విసురుతోంది. ఇక పురుషులతో పోలిస్తే మహిళలే ఈ నొప్పికి ఎక్కువగా గురవుతున్నారని నివేదిక వెల్లడించింది. రాబోయే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా నడుము నొప్పి బాధితుల సంఖ్య 84.3 కోట్లకు పెరుగుతుందని అంచనా వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

90శాతం కేసుల్లో కారణం తెలియదు..!

వెన్నునొప్పికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన, ఆందోళనకరమైన నిజాన్ని వైద్యులు వెల్లడించారు. నడుము నొప్పితో బాధపడేవారిలో దాదాపు 90 శాతం కేసుల్లో నొప్పికి గల నిర్దిష్ట కారణాన్ని లేదా ఏదైనా ప్రత్యేక వ్యాధిని గుర్తించడం సాధ్యం కావడం లేదు. వైద్య పరిభాషలో దీనిని "నాన్ స్పెసిఫిక్ లో బ్యాక్ పెయిన్" (Non specific low back pain) అంటారు.

రోజువారీ జీవితంలో తప్పుడు భంగిమల్లో కూర్చోవడం, కండరాల తీవ్ర ఒత్తిడి, హఠాత్తుగా బరువులు ఎత్తడం వంటి తప్పుడు అలవాట్ల వల్లే ఈ 90శాతం నొప్పి వస్తుంది. కేవలం మిగిలిన 10శాతం కేసుల్లో మాత్రమే వెన్నెముక దెబ్బతినడం, స్లిప్ డిస్క్, కీళ్ల వాతం లేదా క్యాన్సర్ వంటి తీవ్రమైన అంతర్గత కారణాలు ఉంటున్నాయి.

నడుము నొప్పిని జయించే మార్గాలు.. 

నడుము నొప్పి తీవ్రమైనప్పుడు పెయిన్ కిల్లర్స్ మింగడం, శస్త్రచికిత్సల వైపు వెళ్లడం కంటే జీవనశైలిని మార్చుకోవడం, ఫిజికల్ థెరపీ లేదా వ్యాయామం వంటి పునరావాస (Rehabilitation) పద్ధతులను పాటించడమే అత్యుత్తమ మార్గమని WHO సూచిస్తోంది. ఇందుకోసం నిపుణులు సూచిస్తున్న కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు:

శారీరక శ్రమ తప్పనిసరి..

 రోజంతా ఒకే చోట కూర్చోకుండా శారీరకంగా చురుగ్గా ఉండాలి. క్రమం తప్పకుండా తేలికపాటి నడక, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి.

యోగాసనాలు..

 వెన్నుకండరాలను బలోపేతం చేసే యోగాసనాలు నిపుణుల పర్యవేక్షణలో చేయడం వల్ల నడుము నొప్పి నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

సరైన భంగిమ (Posture)..

 ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు కూర్చునేటప్పుడు వెన్నుపూస నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి గంటకు ఒకసారి లేచి 5 నిమిషాలు అటు ఇటు నడవాలి. బరువు నియంత్రణ: శరీర బరువు పెరిగే కొద్దీ ఆ ప్రభావం వెన్నెముకపై పడుతుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఒత్తిడిని తగ్గించుకోవాలి..

 మానసిక ఒత్తిడి, ఆందోళనలు కూడా కండరాల పట్టుత్వానికి కారణమవుతాయి. కాబట్టి ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.నడుము నొప్పిని ప్రాథమిక దశలోనే గుర్తించి, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..

ఇది కూడా చదవండి..  ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.